
- సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఎస్సీలకు18 శాతం నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు కేటాయించాల్సిన నిధులపై శనివారం సీఎంకు లేఖ రాశారు. ‘‘రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లతో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తుండడం హర్షణీయం. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో ఎస్సీలకు 18 శాతం నిధులు రూ.54 వేల కోట్లు కేటాయించాలి.
దళితుల అభివృద్ధికి ఈ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా చేస్తే దళితులు ఎప్పటికీ కాంగ్రెస్పార్టీ వెంటే ఉంటారు’ అని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. అలాగే గతేడాది బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేయకుండా మిగిలిపోయాయని లేఖలో గుర్తు చేశారు.